కర్తవ్యం తోనే భవితవ్యం

మానవులు ఖర్మ చెయ్యకుండా జీవిస్తామంటే వేదం అంగీకరించదు. తన ఉన్నతి కోసం, లోక హితం కోసం ప్రతి మనిషి జీవించినంత కాలం కర్తవ్య కర్మలు ఆచరించాలి. కొంతమంది లౌకిక వ్యవహారాల పట్ల విరక్తి పెంచుకుని ప్రశాంతత కోసం సన్యసించా మంటూ, తమ కర్తవ్యాన్ని విస్మరించి, భాధ్యతల నుంచి పారిపోయి తప్పుకు తిరుగు తుంటారు. ఏ పని చెయ్యకుండా కర్తవ్యాన్ని మరచి, సమస్యల నుంచి పారి పోవటం సన్యసించటం అవదు. మనసును జీవంతో నింపి నిత్యం చైతన్యవంతం గా ఉంచుకుంటూ, తాము చేసే ప్రతి పని మనసు పెట్టి శ్రద్ధగా చేస్తూ, జీవన కార్య కలాపాలు నిర్వ్యర్తించ గలగటమే ప్రతి వ్యక్తి భాద్యత కలిగి ఉండటం అవుతుంది. చేయవలసిన పనులు చేస్తూ ఫలితం గురించి ఆలోచించక కర్మను చెయ్యటమే సన్యాసం అని గీతచార్యులు చెప్పారు. పని చెయ్యకుండా, ఫలితం గురుంచి కలలు కనటం, పరులను ఇబ్బంది పెట్టటం, ప్రతి విషయాన్ని ప్రతికూల భావం తో ఆలోచించటం పనికి రావి విషయాలుగా పరిగణించాలి. ప్రశాంతత కోసం పాకులడుతున్నామంటూ, దాని గురించి ఎక్కడో వెతుకుతూ తిరుగుతున్నమంటూ ఉంటారు కొందరు. తమ గురించి తాము తెలిసుకోగలిగి, తమ జీవితాలను తాము మలచు కోగలిగి నప్పుడు, తమలోనే ప్రశాంతత ను పొందగలమని తెలుసు కోగలగాలి. జీవితాన్ని యాంత్రికంగా గడుపు తున్నామా, లేదా మనకు నచ్చిన విధంగా, ఫదిమందీ మెచ్చుకునేవిధంగా నిర్మించుకుంటున్నామా? అని ప్రతి మనిషి తమను తాము ప్రశ్నించుకోవాలి? తినటం, తిరగటం , పడుకోవటం, నిద్ర లేవటం ఇవే మన జీవితం లో జరిగే ప్రధాన విషయాలయితే, మన జీవితం దానంతంట అదే మన ప్రమేయం ఏమీ లేకుండానే యాంత్రికం గానే గడిచి పోతున్నట్లే. జీవితాన్ని ఫదిమందీ మెచ్చుకునే విధంగా, తనకు నచ్చిన విధంగా మలచు కోవాలనుకునేవారు మంచి ఆశయాలతో, స్పష్ట మైన లక్ష్యాలతో మనుగడను ఒక ‘కర్తవ్యం’ గా నిర్వహించు కుంటారు. దీన్నే జీవితాన్ని నిర్మించు కోవటం అంటారు. నిర్మాణాత్మకంగా జీవితం పట్ల ఆలోచించి, ఆచరించే వారి వైఖిరి, వారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దు కోవటమే కాక, ఆ జీవితం ఎలా ఉంటుందో కూడా స్పష్టంగా తెలుస్తూఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే, తమ జీవన విధానాన్నిఒక ప్రణాళికా బద్ధంగా కొన్ని ముఖ్య విషయాల పట్ల నిర్దేసించుకోవాలి.

ఆరోగ్యం గా శక్తివంతం గా ఉండటం

మన కర్తవ్యం నిర్వర్తించేందుకు శక్తివంతంగా ఉండటం, శరీరాన్ని ఆరోగ్యం గా ఉంచుకోవటం ముఖ్యమని గుర్తించాలి. ఆరోగ్యవంత మైన శరీరం ఎలాంటి బాధను, అనారోగ్యాన్ని, అంటురోగాలను దరిచేరనీయదు. ఆవిధం గా మనవ శరీరం అద్భుతం గా రూపొందించ బడింది. మనం చేయవలసినదల్లా మన శరీరాన్నిఎలా ఆరోగ్యం గా ఉంచుకోవాలో ఆలోచించు కోవటం, అందుకు ఎలాంటి ఆహారం తీసు కోవాలి? ఎలాంటి వ్యాయామం చేయాలి? ఏది చేయ కూడదు? ఏది చేయాలి? తెలుసుకుని దాన్ని ఆచరించటం మాత్రమే.

మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం

ఆరోగ్యకరమైన శరీరంతో పాటు మనసు ప్రశాంతం గా ఉంచుకోవటం అత్యవసర మైన విషయం. మనషికి ప్రశాంతత ఉంటేనే ఆ ఫలితాన్ని ఆనందించ గలరు. కోపం, భయం, అనుమానం, అందోళన ఈ భావాలు మనసును చుట్టుముట్టినప్పుడు ప్రశాంతత అనేది ఆమడ దూరంలో ఉంటుంది. ఆనందాన్ని, ప్రశాంతత ను కొల్లగొట్టే వ్యతిరేక పరిస్థితులను, దానికి కారణమైన సంఘటనల నుంచి, మనుష్యుల నుంచి దూరంగా ఉండేవిధంగా జాగర్త పడాలి. మనసు ప్రశాంతం గా ఉండేందుకు కావలసినవేమిటో ఎవరికి వారు పరిశీలించు కోవాలి. అవి పొందటం మనకు అసాధ్యం అనుకుంటూ కూర్చోకుండా, ప్రశాంతతను పొందేందుకు కావలసినవి తెలుసుకుని వాటిని పొందేందుకు ఏమి చేయాలి? ఎక్కడ ఉండాలి? అక్కడ మనం ఎవరి తో ఉండాలి? మన సమయాన్నిఎలా వినియోగించుకోవాలి అని ఆలోచించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి.

ఆర్థిక స్వాతంత్రం కలిగి ఉండటం

ఆర్ధిక స్వాతంత్రం కలిగి ఉండటం అంటే ఆర్థికంగా ఎలాంటి అందోళన లేకుండా సరిపడినంత ధనం కలిగివుండటం.జీవితం ఒడుదుడుకులకు లోనుకాకుండా వుండేందుకు కావలసిన ‘ధనం’ సంపాదించట జీవితానికి అతి ముఖ్య మైన లక్ష్యం మాత్రమే కాకుండా బాధ్యత కూడాను. ఎక్కువ శాతం ప్రజలు ఆర్ధిక ఇబ్బందులవలనే బాధ పడుతున్నారు. భయం, అందోళన, ఒత్తిడికి లోనవటానికి కారణం డబ్బు వలన ఇబ్బందులే. చాలా కుటుంబాల్లో విడాకుల విషయాలు భందుత్వాల్లో వచ్చే వివాదాలు డబ్బుల వలెనే. మన అవసరాలకు కావలసిన డబ్బు మన సామర్థ్యం తో సంపాదించు కోగలిగినప్పుడు, ఈ డబ్బు వలన వచ్చే వివాదాలు రాకుండా వుంటాయి. మన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు మనం చేస్తున్న పనులును ఎలా మార్చుకోవాలి? అందుకు మనం అధికం గా ఏమి చెయ్యాలి? ఎలాంటి జీవిత విధానం అయితే మనం అందోళన లేకుండా బ్రతకగలం? అందుకు మనం ఎన్ని సంవత్సరాలు పట్టుదలతో పని చెయ్యాలి? మనం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా వుండాలంటే ఎంత డబ్బు అందుబాటులో వుంచు కోవాలి? చివరి దశలో ఎంత డబ్బు నిలువచుకోవాలి? అని ఆలోచించుకుని, ఇలా ఆలోచించటం మన కర్తవ్య భావించి, అందుకు కావలసిన విధంగా పని చెయ్యటం మన లక్ష్యంగా భావించుకోవాలి.

యోగ్యమైన ధ్యేయాన్ని, లక్ష్యాలను కలిగి వుండటం

మనం చేస్తున్న పనులు మన జీవితానికి ఉన్నత విలువలను ఆపాదించేటట్లు వుండాలి. అలాంటి లక్ష్యాలను మనం ఎంచుకోవాలి. మన వ్యక్తిగత విలువలకు ప్రాముఖ్యత కలిగే విధంగా లక్ష్యాలను ఏర్పరుచుకుని, వాటిని సాధించేందుకు ఒక్కొక్క మెట్టు చేరుకుంటూ, ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. అందుకు మనం ఎలాంటి కార్యక్రమాలు రూపొందించు కోవాలి? వాటిని మనం పొందేందుకు ఎంత ఏకాగ్రత తో పని చేయాలి? అని ఆలోచించుకుని వాటిని చేయటం మన కర్తవ్యంగా భావించి ముందుకు సాగాలి

లక్ష్యాలను సాధించేందుకు ఉన్న స్థితి నుంచి మారటం

మనం అనుకున్నలక్ష్యాలు చేరాలంటే మనం ఉన్నన స్థితి నుంచి కొంత మారాల్సి వుంటుంది. జీవితం గురించి, లక్ష్యం గురించి ఆలోచించని చాల మంది యాంత్రికంగా గడిపేస్తూ, తాము చాల సౌఖ్యంగా ఉన్నామనుకుంటూ అధికంగా శ్రమించేందుకు, ఆలోచించేందుకు కూడా ఇస్టపడరు. ఒక ఛట్రంలో ఇమీడిపోయి అదే లోక మనుకుంటూ, అదే ఉన్నతి అనుకుంటూ కాలక్షేపం చేస్తూ, ఎవరైన సలహా ఇవ్వ బోయినా, మాకింత వరకే ప్రాప్తం అంటూ వేదాంతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడు తుంటారు. ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మాత్రమే తాము ఉన్న స్థితి ఏమిటో తెలుసుకుని, తమకంటూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని తాము గౌరవంగా జీవించేందుకు ప్రయత్నిస్తూ, తగిన కృషి చేయగలరు. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు భౌతికంగా, శారీరకంగా ఉన్న స్థితి నే కాక భావపరంగా , మానసిక పరంగా, మనస్తత్వపరం గా కూడా తాము బాగానే ఉన్న స్థితి నుంచి బాటకు రాగలగాలి. అపుడే ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితం పొందగలరు.

ఆత్మజ్ఞానాన్ని పెంచుకుని, వ్యక్తిగత చైతన్యం కలిగి ఉండటం

ఆత్మ జ్ఞానాన్నిపెంచుకోవటం వలన అంతర్గతంగా సంతోషంగా ఉండగలిగి గొప్ప విజయాలను పొందగలుగుతారు. తాము ఏమిటో, తమకున్నదేమిటో, తమకు కావలసిన దేమిటో, తమ నైతిక ప్రవర్తన ఎలా ఉండాలో, తమ జీవితానికి విలువలు ఏ విధం గా ఏర్పరుచు కోవాలో తెలుసు కోవటం ఆత్మజ్ఞాన మయితే, అందుకు తమకు తాము స్పూర్తితో చైతన్యం కలిగించుకుని ఆ పంధాలో పయనించేందుకు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించగలగాలి.

ఎక్కువ ఉన్నది ఇవ్వటం వలన, ఎక్కువ పొందగలగటం

మనకున్నది ఇతరులకు ఇవ్వటం వలన మనం ఎక్కువ పొందగలం. అంటే మనకున్న జ్ఞానాన్ని, చదువుని ఇతరులకు పంచటం వలన అది మరింత వృద్ధిచెందుతుంది. మన వద్ద ఎక్కువ ఉన్నది ఏదైనా ఇతరుల కివ్వటం నేర్చుకోవాలంటే మనకు తృప్తి అనేది తెలుసుండాలి. అది తెలిసినప్పుడు మనకున్నది ఎక్కువ అని తెలుసుకోగలిగి, దాన్ని ఇతరులకు పంచాగాలుగుతాము.

సమర్థవంతంగా పనిచేయటం

మనం కావలసింది పొందేందుకు పనిచేయాలి. ఆ పని ప్రణాళికబద్ధంగా చేస్తూ, నాణ్యమైనదిగాకూడా ఉండేటట్లు జాగర్త పడాలి. ఏ పని చెయ్యని వ్యక్తి బుద్ధి దెయ్యం లా ఆలోచిస్తుందంటారు. పని లేని వ్యక్తులు తాము సరైన జీవితాన్ని పొందలేక పోవటమే కాక ఇతరుల జీవితాలను కూడా ఇబ్బంది పాలు చేస్తుంటారు. భారతీయ ఆధ్యాత్మిక ధృక్పదం ‘పనిని తప్ప ఫలాయన వాదాన్ని’ ఎప్పుడు మర్ధించదు. జేవంతంలోని అన్ని దశల్లోనూ మనిషి తన కర్తవ్హ్యాన్ని నిర్విహించాలని నిర్దేశించింది.ఒక ఇల్లు నిర్మించాలంటే మనం ఎన్ని రకాలుగా ఆలోచించి దాన్ని అమలు పరుస్తామో, అలానే మన జీవితం పట్ల కూడా ఆలోచించు కోవాలి. ఇల్లు నిర్మించు కున్న విధంగా జీవితాన్ని నిర్మించేందుకు మనం నిర్దేశించుకోవలసిన ఈ విషయాలు జీవితానికి ప్రాముఖ్యత నిచ్చే ప్రాధమిక సూత్రాలుగా పరిగణించ బడతాయి. వీటిని మనం అంగీకరించినా, లేకున్నా ఇవి మన జీవితాన్ని చ్యతన్యవంతం చేసి మేలు చేకూర్చటం అన్నది వాస్తవం. వీటిని ఆచరించటం మన కర్తవ్యం గా భావించి అమలు పరచటం వలన మన వ్యక్తిగత ఉన్నతి పెంచుకుని, మన భవిష్యత్హును మనంనిర్మించు కోగలిగిన వారమవుతాం. మన ‘కర్తవ్యాన్ని’మనం తెలుసు కుంటే..మన ‘భవితవ్యం’ మన చేతులోనే వుంటుంది.

‘కొత్తదనం’ జీవితానికే ‘వరం’!

జీవితాన్ని ఎప్పుడూ ఒకేలా, రొటీన్ గా బ్రతకటం లో అందం, ఆనందం కొరవడుతుంది. జీవన వలయాల్ని, జీవిత విలువల్నీ తెలిసిన వారు కొత్త ఊహలతో, కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త గా ప్రయోగాత్మకంగా, పడిలేచే కెరటంలా, ఉరికే జలపాతంలా, నిత్య చైతన్య స్రవంతిలా బ్రతకాలను కుంటారు.

‘నిత్యం చేసే పనులకే కొత్త ఆలోచనలు పులుముకుంటూ , కొత్త అనుభూతి ఆఘ్రాణిస్తూ ఆనందించటమే అర్ధవంతమైన జీవితం అవుతుంది.’

ఫదినెలల వయసు నుండి తింటున్నా, తిండి కోసం ఉరుకులు పరుగులుగా మనిషి కష్టపడుతున్నాడంటే, విసుగు, విరామం లేకుండా ఏ పూట కాపూట ఆసక్తి తో ఎదురు చూస్తున్నాడంటే ‘మానవుని’ లోని పాతదనంలో కొత్తదనం ఊహించి, ఆనందించే మనస్తత్వమే దీనికి కారణం. ఈరోజు నిన్నటి కంటే భిన్నంగా ఉంటుందని, రేపు నేటికంటే విభిన్నంగా ఉంటుందని ఆశతో ఎదురు చూసే నైజం మానవులకు లేకుంటే ప్రపంచ జనాభా లెక్కల్లో అంకెల స్థానాలు చాలా తారుమారు అయ్యేవేమో!

మనిషి లో ఉన్నఈ ఆశాజనిత నైజమే ముందుకు సాగేందుకు ఉత్సాహాన్నిస్తుంది . అది లేకుంటే మనషిలో సోమరితనం చోటు చేసుకుని,మనసంతా నిరాశా, నిస్పృహలు ఆవరించి నిలువెల్లా క్రుంగదీస్తుంది. ఆ సోమరితనమే ప్రధమ శత్రువై మనషిని అన్ని విధాలా అపజయాల పాలు చేస్తుంది. మనషిలోని ఆ ప్రధమ శత్రువును జయించాలంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్య చైతన్యవంతంతో వ్యవహరిస్తూ, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ శక్తి వంతంగా మెలగాలి.

ఈ జగత్తులోని సర్వ శక్తి మానవునిలో నిగూఢంగా ఉంటుందట.మనషిలో అంతర్గతంగా దాగి ఉన్న ఈ శక్తి మూడువిధాలుగా ఉంటుందని మహర్షులు తెలుపు తున్నారు. అందులో ఒఅకటి ‘భౌతిక శక్తి’. దీనిని తక్కువ వినియోగించి ఎక్కువ ఫలతాలను పొందే విధంగా జాగర్తగా వాడుకోవాలి. మనం దైనందిన జీవితంలో చేసే పనుల్లో ఈ శక్తి వినియోగింప బడుతుంది. దీనిని అవసరమైన వాటికి మాత్రమే ఉపయోగించటం వలన మన కర్తవ్య నిర్వహణలో ఎక్కువ విజయాన్ని పొందగలుగుతాము. అంటే నిరుపయోగమైన పనులుకు పూనుకోకుండా సమయాన్ని సరిగ్గా మనకు కావలసిన విధంగా ఉపయోగించుకుంటూ పనిచేయటం ద్వారా ఈ భౌతిక శక్తిని పొదుపుగా వాడుకోవటమవుతుంది.

రెండవది ‘మానశిక శక్తి’. ఈ శక్తి ఎలాంటి అసాధ్య మైన పనులయినా చేయగల సామర్ధ్యాన్ని మనకిస్తుంది. మనం మానసికంగా శక్తి వంతుల మైతే మనం తలపెట్టిన కార్యాలను, చేయవలసిన పనులును, చేరవలసిన లక్ష్యాలను, అవలీలగా సాధించి విజయాన్ని మనకైవసం చేసుకోవచ్చు. అలా మానసికంగా శక్తివంతులమయ్యే వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం అలవరచు కోవాలి. అందోళనలేకుండా మనసుకు విశ్రాంతిని కలిగిస్తూ ఉంటే ఆహ్లాదకరమైన ఆలోచనలు కలగటమే కాక వాటి ఆచరణకై భౌతికంగా మంచి ఆలోచనలతో, నిరంతరం ఆలోచించే విధంగా చైతన్య వంతంగా ఉంచు కోవాలి.

మూడవది ‘నైతిక శక్తి ‘. మనలోని ఉదాత్తభావాలు, ఉన్నత విలువలు ఈ శక్తికి ఆధార మవుతాయి. మనలో దయ, ప్రేమ, కరుణ వంటి మంచి గుణాలను పెంచు కోవటం వలన ఉదాత్తత అలవడి, ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇవి మనలో పెంపొందించు కునేందుకు మంచి పుస్తక పఠనం, సజ్జనుల సాంగత్యం ఎంతో దోహద పడతాయి. మానవ జీవితానికి అవరసరమైన ఈ మూడు శక్తులను సమానంగా వినియోగించుకుంటూ చైతన్య వంతంగా బ్రతకటం అలవరచు కుంటే జీవితం పరవళ్ళు తొక్కుతుంది.

మనిషి జేవితం మధురంగా ఉండేందుకు ఈ అంతరింగక శక్తుల్ని తట్టి మేల్కొల్పాలి . ఈ శక్తి ఎక్కడో బయట నుంచి వచ్చేదో, ఎవరి ద్వారానో లభించేది కాదు. అది మనలో నుంచే ఉవ్వెత్తున ఎగిసి పడాలి. అందుకు మనవంతు ప్రయత్నం చేయాలి. జీవితం లో ఎదిగిన కొద్దీ విజ్ఞతతో ఒదిగి ఉంటూ , వైవిధ్యమైన విషయాలను తెలుసుకోవటంలో ఉత్సుకత కలిగి, ఉన్నత మైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవాలి.

  • ఏ పనినైనా సవాలుగా తీసుకుని తగిన కృషి చేయాలి.
  • ఏదైనా పని చేయటం మొదలు పెట్టిన తరువాత ఎంతటి కష్టతర మైనా ఆపని పూర్తి చేసేందుకే ప్రయత్నం చేయాలి.
  • మనం చేస్తున్న పనిలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా మనకంటూ ఒక ప్రత్యేహ తరహాను అలవరచు కోవాలి
  • మనం చేస్తున్న పని గురించి కొత్త వారెవరైనా కొత్త ఆలోచనలోతో సలహా నిచ్చినప్పుడు సావకాశంగా విని అందులోని విషయాన్ని గ్రహించి సద్వినియోగం చేసుకోవాలి
  • ‘నేర్చుకోవటం’ అనే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి నిరంతర విజ్ఞాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిం చాలి
  • మనసుకు నచ్చిన ‘కళల’ పైన దృష్టి సారించటం వలన మనలో కొత్త శక్తు లేవో ప్రవేశించిన అనుభూతికి లోనై మను ఆహ్లాదకరంగా ఉంటుంది.
  • దైనందిన కార్యక్రమాలలో యోగా,ధ్యానాన్ని చేర్చటం వలన మనలో చురుకుదనం, ఉత్సాహం పెరిగి మనసుకు ప్రశాంతత ఏర్పడి ప్రతి విషయం పట్ల సానుకూలంగా స్పందించటం అలవడుతుంది
  • మైదానాల్లో ఆటలే కాకుండా, ఇంట్లో కూడా ఆడుకునే ఆతల వలన మన మెదడుకు చురుకుదనం పెరిగి మానశిక, శారీరక ఉత్సాహం ఏర్పడుతుంది.
  • మన చుట్టూ ఉన్న వారిలో చిన్నపిల్లలతో, పెద్ద వారితో అప్పుడప్పుడు కొంత సమయం గరపటం వలన కొత్తదనం కలిగి మనసు ఆనందానికి లోనై మరింత ఉత్సాహం మన సొంతం అవుతుంది.
  • మన చుట్టూ పచ్చదనం పెంచుకోవటం వలన మనస్సు, శరీరం కొత్త శక్తిని పుంజుకుంటాయి
  • ‘ఇచ్చుటలో ఉన్న హాయి..వేరెచ్చటనూ లేదోయి’ అన్నారో కవి. మనలో సంకుచిత భావాల్ని విడనాడి నప్పుడు మాత్రమే ఆ హాయి మనకు అనుభవ మయి ఎంతో తృప్తిని. ఉత్సాహాన్ని కలిగిస్తుంది
  • ”మీ మనసుకు చింతలను, మీ లో ఇతరుల పట్ల అసహ్యాన్ని లేకుండా జాగర్త వహించండి
  • “తక్కువ ఆశిస్తూ, ఎక్కువ ఇవ్వటం అలవరుచుకుని , సరళ మైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నించండి.”
  • “మీ జీవితాన్ని ప్రేమతో, మానవత్వం తో నింపుకోండి.”
  • “అమితమైన స్వార్థాన్ని విడనాడి, చీకటిలో మ్రగ్గే వారికి వెలుగులను పంచటాన్ని అలవరచుకోండి.”
  • “జీవితం లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఆహ్లాదాన్ని ఎదుటివారికి పంచుతూ, అర్త్ధవంత మైన జీవనాన్ని కొనసాగించటాన్ని అవసరం గా తెలుసుకుంటే .. జీవితం నిత్యం కొత్త దనం తో సాగుతూ తృప్తిని కలిగిస్తుంది.”

ఎంతటి విలువైన యంత్రాన్ని అయినా ఉపయోగించకుండా వదిలేస్తే, తుప్పు పట్టి పోయి పనికి రాకుండా పోతుంది. అలానే మన మెదడుకు తగినంత పని లేకుంటే చెదపుట్టలా అయిపోయి మనల్నితినేస్తుం ది. అందుకే మెదడుకు పదును కలిగే విధంగా పనులు కల్పించుకుని (ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేవి), అగ్నిలా చైతన్యవంతమై తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరైతే ‘కొత్త ను’ స్వాగతిస్తూ , తమకు తాము వినూత్నంగా మలచు కుంటారో వారు ‘కొత్తదనం’ లోని అనుభూతిని పొంది విజయానికి చేరువయి, ఎంతో సంపూర్ణమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఆ పరిపూర్ణత వారి జీవితంలో ఎంతో హాయినీ, తృప్తిని ప్రసాదించి జీవితమే ఒకవరం అన్న భావాన్ని కలిగిస్తుంది. కొత్త దనాన్ని కొత్త రకం గా ఆహ్వానించి సాగే ప్రవాహం లా , సరికొత్త జీవితాన్ని సొంతం చేసుకుంటారు కదూ!

భయం నీలో పెంచుకోకు.. బతుకు తీపి తెంచుకోకు.

‘మనిషిలో అన్నిటికన్నా పెద్ద వ్యాధి ‘పిరికితనం’. గుండె లేక పోయినా బ్రతకవచ్చు కానీ ..
గుండె ధైర్యం లేకపోతే మాత్రం బ్రతకటం కష్టం.’

జీవితంలో ఎన్నో సంఘటనలు తటస్థ పడుతుంటాయి. అవి మనకు అనుకూలంగా ఉంటే అంతా మన ప్రయోజకత్వమే అనుకుంటాం. మనకూ. మన సౌఖ్యనికీ అడ్డుతగిలేవి అయితే ఖర్మ, విధి అంటూ వాటి నుంచి పారిపోటానికి ప్రయత్నిస్తుంటాము తప్ప వాటిని ఎదుర్కోవటానికి ప్రయత్నించము.కస్టాలనేవి కొన్ని నిజంగా ఉంటాయి. కొన్ని మనం కల్పించుకోవటాన్ని బట్టి ఉంటాయి. తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లూ లేక నిత్య జీవితం పెద్ద సమస్యల నిలయం అయిన వారే కష్టాలు లెక్క చేయ్యక బ్రతుకును ధైర్యంగా ఎడుర్కొంటున్నప్పుడు, అవన్నీ ఉన్న కొంత మంది చిన్న చిన్న సమస్యలకు కష్టాలని పేరు పెట్టుకుని బాధ పడిపోవటం హాస్యాస్పదంగా ఉండదూ ?

ఎవరి సమస్యలు వారికి క్లిష్టంగానే అనిపిస్తాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు అది చాలా కష్టమైనది గానూ, భరించ శక్యం కానిదిగానూ అనిపిస్తుంది. కానీ కాలక్రమేణ అది మామూలు విషయ మైపోతుంది. ఏ సమస్యకైనా కాలమే పరిష్కారం చేపుతుందంటారు పెద్దలు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఏ సమస్య గురించి అయినా సమగ్రంగా అవగాహన చేసుకుని, సంస్కారవంత మైన ఆలోచనతో పరిష్కార మార్గాలు ఎంచుకోవాలి. వాటిల్లో మనం ఏది ఎంచు కోవటమా అన్నప్పుడు సంఘర్షణ మొదలవుతుంది. జీవిత సమస్యల్ని ఎదుర్కోవటానికి ధైర్యం, ఆత్మబలం, బుద్ధిబలం కావాలి.

కేవలం కల్పనా శక్తి కలిగి అందమైన కలల్లో, ఊహల్లో విహరించేటటువంటి వారు వాస్తవం నుంచి పారిపోయి అంతః సంఘర్షణకు లోనవుతారు. తమలో తామే పోరాడుతూ, తాము నిలబడ్డ భూమిని మరచిపోయి, ఆకాశంలో విహరిస్తూ, భ్రమతో బ్రతుకుతుంటారు. తమ చుట్టూ ఉన్నా మనుష్యులు, పరిస్థితులు తమ కల్పనా లోకంలో చిత్రించుకున్న వాటికి భిన్నంగా కనిపింసినప్పుడు, వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రపంచం నుంచి ఫలాయన మంత్రం పఠిస్తుంటారు. వివేచనా శక్తి, సక్రమమైన ఆలోచనా విధానమూ, స్పందించగల హృదయమూ కలిగిన వారిని సమస్యలంత వేధించి బాధించవు.

మనం మధ్య తరగతి మనుష్యులం. అన్నీ అవసరాల్లాగే అనిపిస్తాయి. కానీ, అవి అంత తేలిగ్గా అందేవికావు. అందీఅందకుండా వూరిస్తుంటాయి, మనలాంటి వారిని. మనల్ని చూసి ఈర్ష్య పడే తరగతి మనుష్యులూ ఉంటారు. చిన్న చూపు చూసే పెద్ద మనుషులూ ఉంటారు. అందుకే ప్రపంచంలో అందరికన్నా అతి జాగ్రతగా ఉండవలసిన వారం మనమే. లేనిదాని కోసం తహతహ లాడ కూడదు. అలాగని చతికిలపడి పోకూడదు. ఉన్నంతలో వీలైనంత మంచి జీవితం గడిపేందుకు ప్రయత్నించాలి.ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సహకరిస్తే.. మనంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా, అందులోనూ వైవిధ్యాన్ని, ఆనందాన్ని అనుభవించాలే తప్ప, ప్రతిదీ భూతద్దంలో చూసుకుని పెద్దవిగా అనుకుంటూ బాధపడ కూడదు. నిజంగా పెద్ద సమస్య ఎదురైతే కుటుంబ సభ్యులందరూ కూర్చుని సావకాశంగా ఆలోచించుకుని, చర్చించుకుని ఎలా చేస్తే శ్రేయస్కరంగా ఉంటుందో అలా పరిష్కరించు కోవాలి.

మనం మధ్య తరగతి మనుష్యులం. అన్నీ అవసరాల్లాగే అనిపిస్తాయి. కానీ, అవి అంత తేలిగ్గా అందేవికావు. అందీఅందకుండా వూరిస్తుంటాయి, మనలాంటి వారిని. మనల్ని చూసి ఈర్ష్య పడే తరగతి మనుష్యులూ ఉంటారు. చిన్న చూపు చూసే పెద్ద మనుషులూ ఉంటారు. అందుకే ప్రపంచంలో అందరికన్నా అతి జాగ్రతగా ఉండవలసిన వారం మనమే. లేనిదాని కోసం తహతహ లాడ కూడదు. అలాగని చతికిలపడి పోకూడదు. ఉన్నంతలో వీలైనంత మంచి జీవితం గడిపేందుకు ప్రయత్నించాలి.ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సహకరిస్తే.. మనంత అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. చిన్న చిన్న సమస్యలు తలెత్తినా, అందులోనూ వైవిధ్యాన్ని, ఆనందాన్ని అనుభవించాలే తప్ప, ప్రతిదీ భూతద్దంలో చూసుకుని పెద్దవిగా అనుకుంటూ బాధపడ కూడదు. నిజంగా పెద్ద సమస్య ఎదురైతే కుటుంబ సభ్యులందరూ కూర్చుని సావకాశంగా ఆలోచించుకుని, చర్చించుకుని ఎలా చేస్తే శ్రేయస్కరంగా ఉంటుందో అలా పరిష్కరించు కోవాలి.

అతి సామాన్యమైన మనుష్యులు చిరుగాలికి సహితం చలించిపోయే గడ్డిపోచలా బ్రతుకులో ప్రతి చిన్న విషయానికి ‘కంపించి’ భయపడిపోతూ జీవితాన్నించి పారిపోతానికి ప్రయత్నం చేస్తారు. జేవితాన్ని అర్థం చేసుకుని, ధైర్యంతో, పరిస్తితులతో పోరాడటానికి ప్రయత్నించాలి. కాలం లోని ప్రతిక్షణంలోనూ, జీవితంలోని ప్రతి సంఘటన లొనూ పోరాటం ప్రకటితం కావాలి. ప్రతి జీవి బ్రతుకుకూ పర్యవసానం చావు. ప్రతి నిముషం భయపడుతూ బ్రతకటంలో మన అల్పత్వాన్ని చాటుకోవటమే అవుతుంది. మన పిరికితనాన్ని వెక్కిరించి నట్లుగా ఏదో ఒకరోజు ‘మృత్యువు’ తన కబందహస్తాలు చాచి ఎత్తుకు పోయి తీరుతుంది. భయపడట మెందుకు? అందుకే“జీనాతో యా మర్నా సీఖో, కదం కదం పర్ లఢనా సీఖో “అన్నారో కవి.

మనకు అత్యంత సన్నిహితులు, ప్రేమ పాత్రులు అయిన వ్యక్తి మరణించటమో, మరో రకంగా దూరమవటమో సంభవిస్తే, ఆ మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఒకరకమైన వికలిత మనస్తత్వాన్ని పెంపొందించు కోవటం అవుతుంది. లేదా..ఆ మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతుంది. దుఃఖం. ఆవేదనా కూడా కొద్ది కాలం పోయాక అంత ఉధృతంగా ఉండవు. జీవితంలో ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే భయంకరమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. విధి వక్రించి,కాలదోషం వలన కలిగే చెడు అనుభవాల ప్రశక్తి అప్పటితోనే అంతమైపోవాలి. మళ్లీ మళ్లీ తలచుకునే స్థితి వస్తే మనిషి మానసికంగా ఎంతో ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది. అది అనుభవించే వారికే తెలుస్తుంది.

‘నీటిలో పడ్డ వాన చినుకులు బుడగాల్లా లేచి, కెరటాల్లా విడిపోయి, ఎంతో కాంతిగా జిగేల్ మంటుంటాయి. అవే నీటి కెరటాలు’. “జీవితంలో మన చేతుల్లో లేని కొన్ని పరిస్థితులు, వాన చినుకుల్లా మన బ్రతుకుల్లో పడుతుంటాయి. దాని ఫలితంగా చెయ్యకూడని పనులనే బుడగలు లేస్తుంటాయి. అయితే శాశ్వతమైన జీవితాన్ని, అశాశ్వత మైన బుడగల కారణంగా అంతం చేసుకోవటం” ఎంతవరకు సబబని ఆలోచించాలి. మన జీవితం గురించి మనం తీసుకోవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన ప్రమేయం లేకుండ, మనతప్పు లేకుండా ఏదైనా జరిగినప్పుడు మనమేమీ బాధపడ నవసరంలేదు. మన మనసుకు మనం సమాధానం చెప్పుకోగలిగిన పరిస్థితి ఉంటె చాలు. జీవితంలో వాటినే తలచుకుని చింతిస్తూ.. చితికి చేరువ కాకూడదు.

నిశిరాతిరి ఎంతో భయంకరంగా కనిపించే దృశ్యాలు, తెల్లవారేక, పట్టపగలు సూర్య కాంతిలో చూస్తే ఎంతో సామాన్యంగా కనపడతాయి. పైగా అవన్నీ భయం కోల్పే విధంగా మనకు అనిపించటం.. ఆలోచిస్తే మనకే నవ్వొచ్చే విధంగా ఉంటుంది. అలానే ఆలోచన లేకుండా మనలో ఏర్పడ్డ భయాలు వివేకమనే జ్ఞానకాంతి తో చూసినప్పుడు ఆ భయాలన్నీ పటాపంచలైపోతాయి. మనకెదురైన చేదు అనుభవాల వలన జీవితం మీద కసి పెంచుకుని జీవితాన్ని ద్వేషించటంలో అర్థం లేదు. ప్రతి సమస్యకు ప్రపంచంలో కొన్ని పరిష్కార మార్గాలు ఉంటాయి. వాటిని వెతికి పట్టుకుని అనుసరించటమే కొంచెం శ్రమతో కూడిన పని. జీవితమన్నాక ఎన్నో జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు భరిస్తూ, మరచిపోతూ, కొత్త బాట వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి కానీ, మనం నశించి పోకూడదు.

ఒక నిర్ణయాన్నించి తిరిగిపోవటానికి, మనిషి తెలుసుకోవటానికి, జీవితం మీద వెయ్యిరెట్లు తీపి కలగాటానికి ఒక్క నిమిషం చాలు! దేనిమీదైనా విరక్తి పెంచుకోవచ్చు కానీ, మన జీవితం మీద మనం విరక్తి పెంచు కోకూడదు. ‘బతుకు తీపి’ అనేది ఎంతో గొప్ప విషయం. సృష్టిలోని సూక్ష్మజీవికి సైతం ఈ తీపి ఉంటుంది. జీవితానికి ఉన్న విలువ అపారం. బ్రతుకనేది దేవుడిచ్చిన వరం. జీవితంలో దొరకిన దానిని పదిలపరచుకుని, మనకు లభ్యమైన వాటిలో ఆనందం వెతికి, పొందగలిగే ఆత్మవిశ్వాసాన్ని వయసుతో పాటు పెంచుకోవాలి. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సంతృప్తిగా అనుభవించ టానికి కావలసిన నైతిక సూత్రాలు, నియమాలు, అభ్యాసాలు మన మహర్షులు తెలిపారు. ఆరోగ్యకరమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. రెంటినీ సాధించటమే ప్రయోజనకరమైన విషయ మంటున్నారు వారు. జీవితంపట్ల సరైన అవగాహన లేక క్షణికోద్రేకానికి లోనయ్యేవారు.. ఉద్రేకం వలన, ఒత్తిడి వలన బతుకుని అంతం చేసుకోవాలనుకుంటూ ‘బతుకు సంపద’ను కోల్పోతున్నారు

ఎంతో బలవంతుడయిన హనుమంతుడు, సముద్రాన్ని అవలీలగా దాటగలిగిన వాడు, సాక్షాత్తు శ్రీరాముడు అప్పచెప్పిన పనికోసం.. సీతమ్మ వారి ఆచూకీ తెలుసుకునేందుకు లంకలో ప్రవేశించి, అంతా గాలించి, ఆమె జాడ తెలియక, వట్టి చేతులతో వెళ్ళలేక, శ్రీరామునికి ఏం చెప్పాలో తెలియక, నిరాశతో కుమిలిపోయి.. చేతకాని వానిగా తిరిగి వెళ్లటం కన్నా ఆత్మహత్య మేలని తలపోస్తాడట. కానీ.. అతను వివేకవంతుడవటం వలన తన ఆలోచనలోని తెలివి తక్కువతనాన్నితానే తెలుసుకుని.. తాను తనువు చాలించటం వలన శ్రీరాముని సమస్య పరిష్కారం కాదుకదా అనుకుని మరింత ఓర్పుతో లంకంతా గాలించి, సీతమ్మవారి జాడ తెలుసుకోవటమే కాక, లంకా దహనం కూడా చేసి, రావణునికి తన బలం తెలుసుకునే రకంగా చిన్న చురకంటించి వచ్చాడు.

మన జీవితం మనిష్టం అనుకుంటూ, నా జీవతం గురించి కూడా నాకు ఎలాంటి స్వాతంత్రం లేదా అనుకుంటుంటారు చాలా మంది. మనల్ని మనం నాశనం చేసుకునే హక్కు మనకు లేదు. అందుకే ఆత్మహత్య నేరంగా మన చట్టంలో పేర్కొన బడింది కూడా. “బ్రతుకంతా శూన్యమని పించిన క్షణంలోకూడా ఆ క్షణ మొక్కటే జీవితం కాదని తెలుసుకోవాలి.” ముందు భవిష్యత్తు ఏమిటో తెలియక, నిరాశ పడిన క్షణం దాటితే కలిగే లాభాలు ఏమిటో తెలియక, తొందరపడి మృత్యువుని ఆహ్వానించటం అర్థం లేని విషయం అవుతుంది. బ్రతుకు ముగిసిపోయిన తరువాత మనం చేయగలిగే దేముంటుంది? అందుకే బతికి ఉంటేనే ఏమైనా సాధించగలం.. బ్రతుకులో చేయదలచుకున్న కార్యలపట్ల, జీవితం పట్ల ‘భయం’వీడి‘బతుకు తీపి’ని పెంచుకోవాలి. మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించేందుకు ప్రయత్నించాలేతప్ప జీవింతం అంతా వెతలమయం అయి చిరిగిన ఆకులా మృత్యువు ఒడిలోకి రాలిపోకూడదు.

స్త్రీలు ..వ్యక్తిత్వ వికాస ఆవశ్యకత

ఫది మంది ఉపాధ్యాయులు కంటే ఒక ఆచార్యుడు, నూరుగురు ఆచార్యుల కంటే ఒక తండ్రి,
వెయ్యి మంది తండ్రులు కంటే ‘ఒక తల్లి అధికంగా గౌరవింప దగినదని ‘మనుస్మృతి’’ తెలియ చేస్తుంది.

పిల్లలు జ్ఞాన వంతులు కావటం లో ఈ ముగ్గురు వ్యక్తులు కీలకమైన పాత్ర వహిస్తారని అందులో ‘తల్లి’ నుంచి లభించే జ్ఞానం ఉత్తమమైనదని ‘శతపధ బ్రాహ్మణం’ వ్యాఖ్యానించింది

ఇంత విశిష్టత ఆపాదించు కున్న స్త్రీ , తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్డు కోవలసిన అవసరం ఎంతైనాఉంది. స్త్రీ నిర్వర్తించే భాధ్యతలు అనేకం. ఎన్నోఒడుదుడుకుల మధ్య బతుకును సాగించే స్త్రీ, తన జీవితం ఆనందంగా, ప్రశాంతంగా కొనసాగించేందుకు, తన బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించేందుకు, తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు వ్యక్తిత్వ వికాస ఆవశ్యకత ఎక్కువగా ఉంది.

మన సమాజంలో స్త్రీలకు కట్టుబాట్లు ఎక్కువ. వారు ఎలా నడుచుకోవాలో, జీవితం పట్ల ఎలాంటి దృక్పధం ఉండాలో చిన్నతనం నుంచి తల్లిదండ్రులు, పెద్దవారు చుట్టూఉన్న సన్నిహితులు వారికి బోధిస్తుంటారు. ఆ బోధనా ప్రభావం స్త్రీల జీవితం పైన ఎంతో ఉంటుంది. ఆ విధంగా ఒకరకమైన పద్ధతులకు, సాంఘిక అలవాట్లకు, తదను గుణమైన ఆలోచనలకు అలవాటు పడిపోయి ఉండటం జరుగుతుంది. కానీ, నిజజీవితంలోకి అడుగు పెట్టిన తరువాత వారికి ఎదురయ్యే సంఘటనలు, పరిస్థితులు ముందు తెలిసిన వాటికి భిన్నంగా ఉంది మనసును కలవరపెడుతూ, సత మత పరుస్తుంటాయి. పెద్దలు చెప్పిన రీతిలోనే జీవితం కొనసాగించాలంటే ప్రతిక్షణం మానసిక సంఘర్షణకు లోనవుతూ, నిరాసా నిస్పృహలతో జీవితం పట్ల ఆశాభావాన్ని కోల్పోయే పరిస్థితి ఎదురవుతుంది. మారుతున్న కాలన్ననుసరించి, ఉన్న పరిస్థితుల కనుగుణంగా, ఆలోచనలను మార్చుకుంటూ వాటిని పదును పెట్టుకోవలసిన ఆవశ్యకత చాలా ఉంది పెరిగిన వాతావరణం, మనసులో పెద్దవారు పెంచిన ఆలోచనలు, స్త్రీలకు అనేక అంశాల పట్ల కొన్ని నిర్దుష్ట మైన అభిప్రాయాలు ఏర్పరుచుకుని స్థిరపడేటట్లు చేస్తాయి. అందువల్ల వారి ప్రవర్తన ఒకేరకంగా అలవాటుపడి పోయి, వాస్తవాల కతీతంగా ఉంటూ అనేక ఇబ్బందులకు గురవటం జరుగుతుంది. ఈ జీవితం ఇంతే! ఇదంతా మా కర్మ అనుకుంటూ వేదాంత ధోరణిలో కర్మ సిద్దాంతాలు వల్లే వేస్తూ, అనేకమంది స్త్రీలు నిరాశక్తతతో బతుకును భారంగా, నిస్సారంగా కొనసాగిస్తూ దిగులుతో కృశించి, అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు.

మన సమస్యలను మనం ఎలా అధిగమించగలం? మనల్ని మనం ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలం? అనే ఆలోచన లేక అది మనకు సాధ్యమయ్యే విషయమేనని విస్మరించటం జరుగుతుంది.

మన ప్రవర్తనలో మన ఆలోచనల్లో ఒక భాగంగా రూపొందిన అలవాట్లను- వాటివల్ల కలుగుతున్న పొరపాట్లను సవరించుకోవటం పూర్తిగా సాధ్యమేనని ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అందుకోసం మన జీవితాన్ని అశాంతిమయం చేస్తున్న విషయాలేమిటని ఎవరి వారు విశ్లేషించు కోవాలి. వీటి వెనుక ఉన్న, మనం స్థిరపరచుకున్న అభిప్రాయాలను ముందుగా సమీక్షించు కోవాలి. మన ఆలోచనల ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటని పరిశీలించు కోవాలి. వీటి వెనుక ఉన్న, మనం స్థిరపరచుకున్న అభిప్రాయాలను ముందుగా సమీక్షించు కోవాలి. మనను ఇబ్బందిపెట్టే ఆలోచనలను, అలవాట్లను, ప్రవర్తనను మార్చుకోవాలి అని గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఉన్న ఆలోచనా ధోరణిని మార్చు కునేందుకు మనకు కావలసిన విషయాలను బాగా అర్థం చేసుకుని వాటిని పదే పదే మనసుకు పట్టే విధంగా సరిచేసుకునేందుకు తగిన సామర్థ్యం మనుష్యులక కొక్కరికే ఉంది.

మనం తీసుకున్న నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేసి శాసిస్తుంటాయి. మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మన ఆలోచనలు సరైనవిగా ఉండాలి. దానికి తగిన విధంగా సాధన చేయాలి. ఎప్పటి నుంచో మన జీవితంలో పెనవేసుకుపోయిన అలవాట్లను, మనలో జీర్ణించుకు పోయిన భావాలను మార్చుకుని మనల్ని మనం ఉన్నతంగా తీర్చి దిద్దుకోవాలంటే గట్టి కృషి చేయాలి. మన కృషిని బట్టి మాత్రమే ఫలితాన్ని పొందగలం. చాలా ఎక్కువ మందికి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చి దిద్డు కోవాలనే కోరిక ఉంటుంది. కానీ, అందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలానే ఉంటారు. తమ కున్న సమస్యలను పదే పదే తలచుకుని, తమలో తామే కుమిలి పోతుంటారే కాని, వాటిని అధిగమించేందుకు మనమేం చేయాలని ప్రయత్నించరు. నిరాశా నిస్పృహలతో కుంగిపోతూ అలానే కాలం గడిపేస్తూ, జీవితాన్ని కోల్పోవాలనే నిరాశా భావానికి చేరుకుంటారు. ఆలోచనా సూన్యపరులయి ఏమీ చేయలేని నిస్సహాయత ఆవరించి, డిప్రెషన్ కు గురయి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయి జీవచ్చవం లా బ్రతుకు తుంటారు. కొంత మంది ఒకటి రెండు ప్రయత్నాలు చేసి విఫలమై, ప్రయోజనం లేకపోయింది కదా అనుకుకుంటూ ఇంకా విషాదం లో మునిగి పోతారు. తమ పరిస్థితులను చక్కదిద్దేందుకు, తమ సమస్యలను అధిగ మించేందుకు తమ ఆలోచనా ధోరణి సరిదిద్దు కోవాలనుకుని, తమ ప్రవర్తనను తదనుగుణంగా రూపొందించు కోవాలని ఖచ్చితమైన ప్రయత్నాలు చేయగలిగినప్పుడే తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకో గలుగుతారు.

జీవితం లో జయాప జయాలు, కష్టసుఖాలు అతి సహజం. జీవితం అన్న తరువాత ఆప్యాతలు, ఆదరాభిమానాలు అలాన అవమానాలు, అవహేళనలు అన్నీ ఉంటాయనుకోవాలి. మనకెదురయిన అవమానాలకు సిగ్గుపడుతూ, తలచుకుని బాధపడుతూ, అపజయాల గురించి భయపడుతూ ఉంటే ఒక అడుగు కూడా ముందుకు సాగాలేం . మన జీవితానికి ఒక లక్ష్యం ఏర్పరుచుకుని, దాని కోసం ప్రయత్నం చేస్తూ సాధించేవరకూ కృషి కొనసాగించాలి. జీవనం సుగమం కావాలంటే, జీవితం సుఖమయం కావాలంటే మనలోని ఆలోచనలు, అభిప్రాయాలు సరైనవి, సరళమైనవి కావలి. మంచి చెడులను నిర్ణయించుకుని ముందుకు సాగగల పరిపక్వతను ఏర్పరచు కోవాలి. జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, సమస్యలకు ఎదురునిలబడి సమర్ధించుకునే, సమాధాన పరచుకునే స్థైర్యం పెంచుకోవాలి. విషయాన్ని- విషయంగా ఆలోచించగల నేర్పును, విషయ పరిజ్ఞానం పెంచుకునే ఓర్పును అలవరచు కోవాలి.

మనమేమిటి? మనకున్న పరిస్తితి ఏమిటి? మనకున్న వనరులు ఏమిటి? మనకు ఇబ్బంది పెడుతున్న సమస్యలేమిటి? వాటి కున్న పరిష్కారాలేమిటి? ఆ పరిష్కారాలలో మనకు అనుకూలంగా ఏమున్నాయి? ఏ రకంగా మనం ముందుకు సాగాలి? జీవితానికి లక్ష్యాన్నిఎలా సాధించాలి? సాధించే మార్గంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా అధిగమించాలి? ఇలా ఆలోచించ గలిగినప్పుడే – జీవితం లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని, వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం లో సఫలీకృతులుకాగలరు. “ఎవరయితే తమకు కావలసింది ఏమిటో నిజంగా తెలుసుకోగలుగుతారో వారే తమలక్ష్యాలను చేరుకొనగలుగుతారు.’ చాలా ముఖ్యమైనది. మొట్టమొదిటిది - అంతర్గతంగా మన మనసులో నిజంగా మనం ఏం కావాలను కుంటున్నామో తెలుసుకోవటమే’ నని ప్రముఖ సైకాలజిస్ట్ డా.జైసీ అంటారు. తమ గురించి తాము తెలుసుకోగలిగి, తమ జీవితాలను తాము మలచు కోగలిగినప్పుడు, తమ జీవితాన్ని సంతోషంగా, ప్రశాంతంగా జీవించ జలుగు తారు.

మన జీవితాన్నిఫది మంది మెచ్చుకునేవిధంగా మలచుకోవాలనుకుంటే.. వారు మంచి ఆశయాలతో, స్పష్ట మైన లక్ష్యాలతో మనుగడను ఒక ‘కర్తవ్యం’ గా భావించి నిర్వహించు కుంటారు.దీన్నేజీవితాన్ని నిర్మించుకోవటం అంటాం. నిర్మాణాత్మకంగా జీవితం పట్ల ఆలోచించి, ఆచరించే వారి వైఖిరి, వారి జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవటమే కాక, ఆ జీవితం ఎలా ఉంటుందో అని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అల్లాంటి జీవితాన్ని పొందాలంటే, తమ జీవన విధానాన్ని ప్రణాళికా బద్ధంగా తమ లక్ష్యాలను చేరు కునేందుకు కావలసిన ముష్య విషయాల పట్ల నిర్దేశించు కోవాలి. మనం ఎంచుకునే లక్ష్యం ఎగ్యమ్య్నడిగా ఉండాలి. మనం చేస్తున్న పనుల మన జీవితానికి ఉన్నత విలువలను ఆపాదించే టట్లు ఉండాలి. అలాంటి లక్ష్యాలను మనం ఎంచుకోవాలి. మన వ్యక్తిగత విలువలకు ప్రాముఖ్యత కలిగే విధంగా లక్ష్యాలను మనం ఎంచుకోవాలి. ఆ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒకొక్క మెట్టు చేరుకుంటూ, అందుకు కావలసిన కార్యక్రామాలను రూపొందించుకుని, వాటిని పొందేందుకు ఏకాగ్రతతో పనిచేయాలి.

మనం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఒక్కోసారి మనం ఉన్న స్థితి నుంచి కొంత మారవలసి ఉంటుంది. జీవితం గురించి, లక్ష్యం గురించి, ఆలోచించని చాలమంది యాంత్రికంగా గడిపేస్తూ, తాము చాలా సౌఖ్యంగా ఉన్నామనుకుంటూ అధికంగా శ్రమించేందుకు , ఆలోచించేందుకు కుడా ఇష్టపడరు. ఒక చట్రంలో ఇమిడిపోయి అదే లోకమనుకుంటూ, అదే ఉన్నతి అనుకుంటూ కాలక్షేపం చేస్తూ, ఎవరైనా సలహా ఇవ్వబోయినా మాకింత వరకే ప్రాప్తం అంటూ వేదాంతాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. ఉన్నత వ్యక్తిత్యం కలిగిన వ్యక్తులు మాత్రమే తాము ఉన్న స్థితి ఏదో తెలుసుకుని, తమకంటూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని తాము గౌరవంగా జీవించేందుకు ప్రయత్నిస్తూ తగిన కృషి చేయగలరు. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు భౌతికంగా, శారీరకంగా ఉన్న స్థితినేకాక మానసికంగా, భావపరంగా, మనస్తత్వ పరంగా కూడా తాము బాగానే ఉన్నామనే స్థితి నుంచి బయటకు రాగలగాలి. అప్పుడే ఉన్న జీవితం కంటే ముందు ముందు మెరుగైన జీవితాన్ని పొందగలరు.

మనలో ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవటంవల్ల అంతర్గతంగా సంతోషంగా ఉండగలిగి గొప్ప విజయాలను పొందగలుగుతాం. తాము ఏమిటో, తమ కున్నదేమిటో, తమకు కావలసిన దేమిటో, తమ నైతిక ప్రవర్తన ఎలా ఉండాలో, తమ జేవితానికి విలువలు ఏ విధంగా ఏర్పరుచు కోవాలో తెలుస కోవటం ‘ఆత్మజ్ఞానం’ అయితే, అందుకు తమకు తాము స్పూర్తితో ఆ పంథాలో పయనించేందుకు తమ కర్తవ్యాన్ని తెలుసుకుని నిర్వర్తించ గలగటం చైతన్యం ఉండటం అవుతుంది. మనకు కావలసింది పొందేందుకు మనం చేసే పనిని ప్రణాళికా బద్దంగా చేస్తూ, నాణ్యమైనదిగా కూడా ఉండేటట్లు జాగర్త పడాలి. ఏపనీ చేయని వ్యక్తి బుద్ధి దెయ్యం లా (చెడ్డగా) ఆలోచిస్తుందంటారు. పనిలేని వ్యక్తులు తాము సరైన జీవితాన్ని పొందక పోవటమే కాక ఇతర జీవితాలను కూడా ఇబ్బంది పాలు చేస్తుంటారు. భారతీయ ఆధ్యాత్మిక దృక్పధం ‘పనిని తప్ప ఫలాయన వాదాన్ని’ ఎప్పుడూ సమర్థించదు.జీవితంలోన అన్ని దశల్లోనూ మనిషి తన కర్తవ్యాన్ని నిర్వహించాలని నిర్దేశించింది.

మనకు ఎక్కువ ఉన్నది ఇవ్వటం వల్ల ఎక్కువ పొందగలం. మనకున్నది ఇతరులకు ఇవ్వతంవల్ల మనం ఎక్కువ పొందగలం. అంటే మనకున్న చదువునజ్ఞానాన్ని ఇతరులకు పంచాతంవల్ల అది మనలో మరింత వృద్ధి చెందుతుంది. ఇతర విషయాల్లో మావద్ద ఎక్కువ ఉన్నది ఏదైనా ఇతరుల కివ్వటం నేర్చు కోవాలంటే .. .. ..

మనకు ‘ తృప్తి’ పరతం అనేది తెలిసి ఉండాలి. అది తెలిసినప్పుడు మనజున్నది, ఎక్కువేదో తెలుసుకోగలిగి, దాన్ని ఇతరులకు పంచాగాలుగుతాం.జీవితాన్ని ఎప్పుడు ఒకేలాగా, బతకటం లో అందం, ఆనందం కొరవడి బోర్ ఫీలవ్వటం అవుతుంది. ఈ రోజు నిన్నటి కంటే భిన్నంగా ఉండాలని, రేపు నేటికంటే విభిన్నం గా ఉండాలని ఆశాజనిత నైజమే మనిషి ముందుకు సాగేందుకు ఉత్సాహాన్నిస్తుంది. అది లేకపోతే సోమరితనం చోటు చేసుకుని, మనసంతా నిరాశా, నిస్పృహలు ఆవరించి నిలువెల్లా కుంగదీస్తుంది. ఆ సోమరితనమే ప్రధమ శత్రువై అన్ని విధాలా అపజయాలపాలు చేస్తుంది. దీనిని జయించాలంటే సర్వకాల సర్వావస్థల్లోనూ నిత్య చైతన్యంతో వ్యవహరిస్తూ ఉత్సాహంగా శక్తివంతంగా మెలగాలి. ఈ జగత్తులోని సర్వ శక్తీ మానవునిలో నిగూడంగా ఉంటుందట. మనిషిలో అంతర్గతంగా దాగివున్న ఈ శక్తి మూడువిధాలుగా ఉంటుందని మహర్షులు తెలుపుతున్నారు.

అందులో ఒకటి ‘భౌతిక శక్తి’. దీనిని తక్కువ వినియోగించి ఎక్కువ ఫలితాలు పొందేవిధంగా జాగ్రత్హగా వాడుకోవాలి. నిరుపయోగమైన పనులకు పూనుకోకుండా, సమయాన్ని సరిగ్గా మనకు కావలసిన విధంగా ఉపయేగించుకుంటూ పని చెయ్యటం ద్వారా ఈ భౌతియా శక్తి ని పొదుపుగా వాడు కోవటం కోసం మనకర్త్వవ్య నిర్వహణలో ఎక్కువ విజయాన్ని పొందగాలుగుతాం. రెండోది ‘మానసిక శక్తి’. ఈ శక్తి ఎలాంటి అసాధ్యమైన పనులనయినా చేయగల సామర్థ్యాన్ని మనకిస్తుంది. మనం మానసికంగా శక్తివంతులమైతే మనం చేయదలచుకున్న పనులను, చేయదలచుకున్న పనులను,చేరవలసిన లక్ష్యాలను అవలీలగా సాధించి విజయాన్ని మన కైవసంచేసు కోవచ్చు. అలా మానసికంగా శక్తివంతుల మయ్యేవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం అలవరచు కోవాలి. ఆందోళన లేకుండా మనసుకు విశ్రాంతి కలిగిస్తూ ఉంటె, ఆహ్లాదకరమైన ఆలోచనలు కలగటమేకాక వాటి ఆచరణకోసం భౌతికంగా మంచి ప్రాత్సాహం లభిస్తుంది. ఇలా మనసును మంచి ఆలోచనలతో, నిరంతరం ఆలోచించగల విధంగా చైతన్యంతో ఉంచుకోవాలి. మూడోది ‘నైతిక శక్తి ‘. మనలోనే ఉదాత్త భావాలూ, ఉన్నత విలువలు ఈ శక్తికి ఆధారమవుతాయి. మనలో దయ, ప్రేమ, కరుణ వంటి గుణాలను పెంచుకోవటంవల్ల ఉదాత్తత అలవడి, ఉన్నతమైన వ్యక్తిత్యం ఏర్పడుతుంది. ఇవి మనలో పెంపొందించుకునేందుకు మంచి పుస్తకపఠనం, సజ్జనుల సాంగత్యం ఎంతో దోహద పడతాయి. జీవితానికి ఉపయేగాపడే ఈ మూడు శక్తులను సమానంగా వినియయేగించుకుంటూ చైతన్య వంతంగా బతకటం నేర్చుకుంటే జీవితం కొత్తదనంతో పరవళ్ళు తొక్కుతుంది.

ప్రత్యేకంగా స్త్రీలలో చాలా శక్తి నిగూఢం గా ఉంటుందట. ఈ అంతర్గతంగా గా ఉన్న శక్తులను తట్టి ప్రతి స్త్రీ మేల్కొనాలి. ఈ శక్తి ఎక్కడో బయట నుండి వచ్చేదో ,ఎవరి ద్వారానో లభించేదో కాదు. అది తమలో నుంచి ఉవ్వెత్హున ఎగిసి పడాలి. అందుకు మనవంతు ప్రయత్నం మనం చేయాలి. అందుకు ఏ పనినైనా సవాలుగా తీసుకుని తగిన కృషిచేయాలి. ఏదైనా పని చేయటం మొదలు పెట్టిన తరువాత ఎంతటి కష్టతరమైనా ఆ పని పూర్తి చేసేందుకే ప్రయత్నించాలి. మనం చేస్తున్న పనిలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా మనకంటూ ఒక ప్రత్యేక తరహాను అలవరచుకోవాలి. మనం చేస్తున్న పని గురించి కొత్త వారెవరైనా కొత్త ఆలోచనలతో సలహా నిచ్చినప్పుడు సావకాశంగా విని అందులోని విషయాన్ని గ్రహించి సద్వినియేగం చేసుకోవాలి. నేర్చు కోవటం అనే విషయానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి నిరంతర విజ్ఞాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. మనసుకు నచ్చిన కళ పైన దృష్టి సారించటం వల్ల మనలో కొత్త శక్తులేవొప్రవేశించిన అనుభూతికి లోనై మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో యేగా, ధ్యానాన్ని చేర్చటం వల్ల మనలో చురుకుదనం, ఉత్సాహం పెరిగి మనసుకు ప్రశాంతత ఏర్పడి ప్రతి విషయం పట్ల సానుకూలంగా స్పందించటం అలవాటవుతుంది. మైదానాల్లో ఆటలతో పాటు, ఇంట్లో ఆడుకునే ఆటలవల్ల మనమేదదుకు చురుకుదనం పెరిగి మానసిక, శారీరక ఉత్సాహం ఏర్పడుతుంది. మన చుట్టూ పచ్చదనం పెంచుకోవటం వల్ల మనస్సు శరీరం కొత్త శక్తిని పుంజుకుంటాయి

ఎంతటి విలువైన యంత్రంగానయనా ఉపయెగించకుండా వదిలేస్తే తుప్పు పట్టి పోయి పనికి రాకుండా పోతుంది. అలానే మన మెదడుకు తగినంత పనిలేకుంటే చెదపుట్టలా అయిపోయి మనల్ని తినేస్తుంది. అందుకే మెదడుకు పదును కలిగే విధంగా పనులు కల్పించుకుని చైతన్య వంతమై తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరైతే తమ మనుగడకు ఆటంకం కలేగించే అలవాట్లను మార్చుకుంటారో, తమ లక్ష్యాలని చేరుకోవటంలో ఇబ్బంది పెడుతున్న నమ్మకాలను వదులుకుంటారో, కాలానుగుణంగా వస్తున్న ‘మార్పు’లను గమనించి తమ గమనాన్ని మార్చుకుని ‘కొత్త’ ను స్వాతిస్తూ తమను తాము వినూత్నంగా మలచుకుంటారో .. వారు మనిషి (మధుర) జీవనంలోని అనుభూతిని ఆనందంతో పొంది విజయానికి చేరువయి, ఎంతో సంపూర్ణ మైన జీవితాన్ని పొందగలుగుతారు. ఆ ‘పరిపూర్ణతే’ వారి జీవితంలో ఏంటో హాయిని, త్రుప్తిని ప్రసాదించి, వారి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు దోహదమయి, ఉన్నత శిఖరాలను అధిరోహించాగల శక్తిని, విజ్ఞతను అందిస్తుంది. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రతి స్త్రీ అలవరచుకున్నప్పుడు, ఎప్పటికప్పుడు వారి వ్యక్తిత్వాన్ని పదును పెట్టుకుంటూ అందుకు తగిన వికాసాన్ని పొందకలిగినప్పుడు, తమ సంతానికి ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవరచి, కుటుంబానికి, సమాజానికి ఆదర్శవ్యక్తులుగా చరిత్రలో నిలువ గలుగుతారు.

-ఉషా కిరణ్మయి